![]() |
![]() |
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్, లెజెండరీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణె మధ్య ఉన్న మామ-అల్లుళ్ల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి మధ్య ఉన్న క్లోజ్ బాండింగ్ గురించి తాజాగా ప్రకాశ్ పదుకొణె ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా అల్లుడు రణ్వీర్ నటించిన రీసెంట్ హిట్ చిత్రం ‘ధురంధర్’ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ సినిమాను చూశానని, అది చాలా అద్భుతంగా తెరకెక్కిందని ప్రకాశ్ పదుకొణె ప్రశంసించారు. సినిమాలో ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతంగా నటించారని కొనియాడారు. అయితే ఈ మూవీలో హింస మోతాదుకు మించి ఉందనిపించిందని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. అయినప్పటికీ మెజారిటీ ప్రేక్షకులకు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాగా నచ్చిందని, అల్టిమేట్గా ఆడియన్స్ను మెప్పించడమే సినిమాకు ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక రణ్వీర్ సింగ్ కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. తమ రెండు ఫ్యామిలీలు ఎంతో క్లోజ్గా ఉంటాయని తెలిపారు. తమ బిజీ షెడ్యూల్స్ వల్ల నిరంతరం కలవడం కుదరకపోయినా, ప్రతి ఏటా కనీసం ఒక్కసారైనా అందరం కలిసి వెకేషన్స్కి వెళ్తామని చెప్పారు. అలా కలిసి ఉన్నప్పుడు దొరికిన సమయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తామని పదుకొణె వెల్లడించారు.
ముఖ్యంగా అల్లుడు రణ్వీర్తో కలిసి కూర్చుంటే స్పోర్ట్స్, సినిమా బిజినెస్ గురించే ప్రధానంగా చర్చ జరుగుతుందని ఆయన నవ్వుతూ చెప్పారు. రణ్వీర్కు క్రీడలంటే విపరీతమైన పిచ్చి ఉండటంతో బ్యాడ్మింటన్తో పాటు ఫుట్బాల్, క్రికెట్ గురించి అడుగుతుంటాడని.. అలాగే తనకు సినిమాల కలెక్షన్స్, బిజినెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటంతో ఇద్దరి మధ్య మంచి సంభాషణ సాగుతుందని అన్నారు. ఇంట్లో తామంతా కలిసి ఫుట్బాల్ మ్యాచ్లు చూస్తూ అల్లరి చేస్తామని, రణ్వీర్ ‘ఆర్సెనల్’ టీమ్కు సపోర్ట్ చేస్తే, తన చిన్న కూతురు అనీషా ‘మాంచెస్టర్ యునైటెడ్’ టీమ్ను సపోర్ట్ చేస్తుందని తమ ఇంట్లోని సరదా వాతావరణాన్ని పంచుకున్నారు.
ఇదే సమయంలో సోషల్ మీడియాకు తాను ఎందుకు దూరంగా ఉంటానో కూడా ప్రకాశ్ పదుకొణె స్పష్టం చేశారు. డిజిటల్ ప్రపంచంలో అనవసరమైన విషయాల వల్ల సమయం వృథా అవుతుందని, అందుకే తాను సోషల్ మీడియా వాడనని చెప్పారు. తన కూతుళ్లు దీపికా, అనీషాల ద్వారానే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటానని పేర్కొన్నారు.
![]() |
![]() |